Thursday 5 April 2012

LAST DAYS OF ACTRESS SAVITHRI



నటులు ఎందరో వుంటారు. కాని మహానటులు
ఒక్కరే వుంటారు. ఆ ఒకే ఒక్క మహానటి సావిత్రి.
జీవించింది నలభై ఏడేళ్ళే- అయితేనేం చిరస్థాయిగా
నిలిచే నటనా కీర్తి సంపాదించింది..
ఆమె సెట్లో ఉందంటే ఎస్.వి.రంగారావులాంటి
నటుడు కూడా నటన విషయంలో జాగ్రత్తగా ఉండాలి
అని మనసులో అనుకునేవాడట. సాటి నటీమణులకు
ఆమె అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆమెను తల
చుకుంటే చాలు నటన అదే వస్తుంది.
సావిత్రి తెలుగమ్మాయి అంటే తమిళులు నమ్మరు.
ఒక్క తమిళులే కాదు,ఆమె ఏ భాషలో నటిస్తే ఆ భాషను
అంత స్పష్టంగా, తన మాతృభాషలాగానే మాట్లాడగలి
గిన నేర్పు ఆమెది. రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు,
తమిళ చలనచిత్రరంగంలో తిరుగులేని తారగా వెలు
గొందిన సావిత్రి చివరిరోజులు అంత బాధాకరంగా గడు
స్తాయని ఎవరూ అనుకుని వుండరు.
సినిమా నటులకు నటన తప్పించి నురేదీ చేతకాదు
అనుకుంటారు. కాని వారికీ మనసుంటుందని, అది
స్పందిస్తుందని తెలియదు. సావిత్రి మనసు ప్రేమను
కోరుకుంది. ప్రేమ పిచ్చిది అన్నమాట ఆమెకు బాగా
అతుకుతుంది. జెమినీ గణేశన్ని పిచ్చిగా ప్రేమించింది.
అతనికి అప్పటికే వివాహమైందని, అతనికి చాలామంది
తారలతో సంబంధాలున్నాయని తెలుసు.
ఆ విషయంలో ఆమెను హెచ్చరించనివారు లేరు.
ఐనా రహస్యంగా మైసూరు వెళ్ళి చాముండేశ్వరీదేవి సమ
క్షంలో పెళ్ళాడింది. అప్పటికి ఆమె వయసు రెండు పదు
ల్లోపే. ఆ వివాహమే ఆమె జీవితాన్ని మార్చివేసింది.
సావిత్రి సినీ కెరీర్ అద్భుతంగా ఉన్నప్పుడు జెమినీ
గణేశన్ ఆమె వెంటే వున్నాడు. తాను తాగుతూ సరదాగా
సావిత్రిని తాగమని అడిగాడు. అంతవరకు మందు
ముట్టని సావిత్రి తర్వాత జెమినీ గణేశన్ పుణ్యమా అని
మందు లేకుండా బతకలేని స్థితికి వచ్చింది.
ప్రతిరాత్రి మందు కావాలి. సినిమా అవకాశాలు తగ్గ
టంతో ఆదాయం తగ్గింది. అంతగా చదువుకోని సావిత్రి
అమాయకురాలు. ఆర్థికపరమైన లావాదేవీలు ఎలా నిర్వ
హించాలో తెలియదు. ఎవరినిపడితే వారిని నమ్మింది.
అవే ఆమెకు సమస్యలు తెచ్చి పెట్టాయి. సావిత్రి సంపాదన
మీద పెత్తనం చెలాయించాలను కున్న జెమినీ గణేశన్
చాలావరకు విజయం సాధించాడు. గుడ్డిగా తన ఆదాయ
మంతా భర్త చేతిలో పెట్టిందామె.
తెలుగులో వచ్చిన 'మూగమనసులు' సినిమా, అందులో
ఆమె పాత్రను ప్రేక్షకులు మరువలేరు. ఆ సినిమాను
తమిళంలో నిర్మించాలనుకుంది సావిత్రి. అందుకు
హీరోగా భర్తను ఎంపికచేసుకోవడం,దానిమీద భర్త అభ్యం
తరంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. తన డబ్బు
తన ఆధీనంలో లేదన్న వాస్తవం తెలిసివచ్చింది.
సినిమా ఆగకూడదన్న పట్టుదలతో ఆ సినిమాను
పూర్తిచేసి విడుదల చేసింది. అంత చక్కని కథ కలిగిన
సినిమాను తమిళులు ఎందుకు తిరస్కరించారో తెలి
యదు. ఆర్థిక నష్టం, అప్పుల మీద వడ్డీలు. తన మాట
వినలేదన్న కోపంతో జెమినీ గణేశన్ ఇంటికి రావడం మానే
శాడు. ఎంతగానో ప్రేమించిన భర్త దూరమవడం ఆమె
ఆరోగ్యం మీద ప్రభావం చూపించాయి.
అధిక రక్తపోటు, షుగర్ జబ్బు వారి వంశంలో
వస్తున్న అనారోగ్యాలు. అవి రెండూ వున్నవారు తీసుకోవా
ల్సిన జాగ్రత్తలు సావిత్రి తీసుకోలేదు.
1971కల్లా సావిత్రి తాగుడుకు బానిస అయింది.
తాగుడు వద్దని దేవదాసుకు నీతిబోధ చేసిన ఈ సినీ
పార్వతి అదే తాగుడులో మునిగితేలింది. తాగుడు
తప్పించి తిండి తినదు. శరీరం, మనసు రెండూ పాడ
య్యాయి. సావిత్రి చుట్టూ వందిమాగధులు చేరి ఆమెను
ఉబ్బి తబ్బిబ్బు అయ్యేలా చేసేవారు.
ఆమెది మొదటి నుండి మహారాణి జీవితమే. మహా
రాణులు దానం చేసినట్టే తన దగ్గరున్నది అలా తీసి
ఇచ్చేది.
కాలం మారినా ఆమె అలవాటు మారలేదు. అడి
గినవారికి ఏదో ఒకటి ఇచ్చే అలవాటు పోలేదు.
ఇదంతా కూతురు, అల్లుడుకి నచ్చలేదు. ఆమె
వియ్యాలవారికీ నచ్చలేదు. వారు విధిస్తున్న ఆంక్షలకు
లోబడి బతకడం సావిత్రికి ఇష్టం లేదు. ఫలితంగా తాను,
మహారాణిలా బతికిన బంగళాను వదిలి కేవలం 500
రూపాయల అద్దెకు చెన్నపట్నంలోని అన్నానగర్ ప్రాంతా
నికి మారింది. ఆ చిన్న ఇంట్లోనే కొడుకుతో గడిపింది.
నాటివరకు సావిత్రి ఆదాయపుపన్ను సక్రమంగా
చెల్లించలేదు. దానిమీద నోటీసులు పంపించారు.
చాలాకాలం ఆ నోటీసులను పట్టించుకోలేనంత
మత్తులో ఉండిపోయింది. ఫలితం ఆదాయపుపన్ను
శాఖవారు వడ్డీల మీద వడ్డీలు లెక్కలు కట్టి లక్షలలో
బకాయి చూపించి కడతారా లేక ఆస్తులు జప్తు చేయ
మంటారా! అని బెదిరింపులు మొదలు పెట్టారు.
తాగుడు తనని పతనం చేసిందని ఆమె అర్థం చేసు
కుని, ఆ మత్తు బానిసత్వం నుండి బయటపడి మళ్ళీ
సినిమాలలో నటించడం మొదలు పెట్టింది.
ఆ మహానటిని దర్శకత్వం వహించే అదృష్టం కోసం
ఎదురుచూస్తున్న దర్శకులు ఆదరించారు. ఆమెతో
నటించే మహదావకాశం కోసం ఎదురుచూసే నటులు
పొంగిపోయారు.
కాని పీక్కుపోయిన ఆమె ముఖం చూసి
ప్రేక్షకులు మాత్రం కంటతడి పెట్టారు.
ఒక కన్నడ షూటింగ్ కోసం బెంగళూరు వెళ్ళిన
సావిత్రి తన ఆస్తులన్నీ జప్తుచేసే నోటీసు వచ్చిందన్న'
విషయం తెలుసుకుంది. అప్పటికి రెండు మూడేళ్ళుగా
మందు మానేసిన సావిత్రి ఆ రోజు హోటల్లో తిరిగి తాగ
డం మొదలు పెట్టింది. దగ్గర ఎవరూ లేరు.
తాగడం మొదలు పెట్టిన తర్వాత ఇక ఆపడం తెలి
యలేదు. తెప్పించుకున్న ఆహారం తినలేదు. అప్పటికే
ఆమెకు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం
ఏర్పడింది. తనకు తానుగా ఇన్సులిన్ డోస్ తీసుకుం
టుండేది. కాని ఆరోజు ఆ ఇంజెక్షన్ తీసుకుందో లేదో
తెలియదు. తీసుకుంటే వెంటనే ఏదోకటి తినాలి. కొడుకు
సతీష్ బలవంతం చేస్తే బిస్కెట్ మాత్రం తిన్నది.
"మైసూరు నుండి బెంగళూరు మీదుగా మద్రాసు వెళ్ళే
టప్పుడు ఇక్కడ ఆగి ఒక కుక్క పిల్లను కొని తీసుకువెళ
దాం" అని కొడుకుతో చెపుతూ నిద్రలోకి జారుకుంది.
తెల్లవారింది. కాని ఆ మహానటి నిద్రలేవలేదు. నోటి
వెంట నురగ వస్తోంది. విషపుపురుగు కుట్టిందేమో అని
అనుకున్నారు. కాని ఆమె డయాబెటిక్ కోమాలోకి
వెళ్ళింది. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుని ఆహారం తిననం
దున ఆమెకువచ్చిన ఇబ్బంది అది. 1980 మే 11న
కోమా
లోకి వెళ్ళిన మహానటి 1981 డిశంబరు 26న మరణించే
వరకు ఆమె పరిస్థితిలో ఏ మార్పులేదు.
ఎప్పుడైనా ఎవరైనా వెళితే కళ్ళు తెరచి చూసినా ఆమె
గుర్తుపట్టిందో లేదో తెలియని పరిస్థితి. ఆమెకు నచ్చిన
పాటలు వినిపిస్తే స్పందిస్తుందని అనుకుని ఆమె నటిం
చిన పాటలు వినిపించేవారు. 'దేవదాసు' సినిమాలోని
'కలయిదనీ... నిజమిదనీ... బ్రతుకింతేనులే' పాటకు
కొంచెం కదలిక చూపించేదంటారు.
బక్కచిక్కిపోయి, ఎముకలగూడులా మారిపోయిన
సావిత్రి, శరీరంలోని ఒక్కొక్క అంగం పనిచేయడం మానే
స్తుంటే ఆమె ఎప్పటికైనా కోలుకుంటుందేమోనన్న ఆశతో
గొట్టం ద్వారా ద్రవ ఆహార పదార్థాలను ఎక్కిస్తూ వైద్యులు
చెయ్యగలిగినదంతా చేశారు.
మహానటి సావిత్రి సినిమాలలో ఎన్నో పాత్రల ద్వారా
జీవితపోరాటం చేసింది.
కాని వ్యక్తిగత జీవితంలో మాత్రం
పోరాటం చెయ్యనంది. ఈ లోకం నుండి ఎంత త్వరగా
వెళ్ళిపోదామా అనే ప్రయత్నమే ఆమెది.
ఎన్నో రకాలుగా ఆమెను వేధించిన విధి చివరిలో
సహకరించిందేమో! కాని ఆమె చెప్పాలనుకుంటున్న
చివరిమాటలేవో చెప్పకుండానే వెళ్ళిపోయింది.


No comments:

Post a Comment